* మును తానాంధ్ర కవిత్వ భూజమున కామోదమ్ముతో ప్రేమతో
ననురాగమ్మొనరన్ జలంబులిడి యాప్యాయమ్ముగా పాదు తీ
సిన ధీశాలిని నన్నపార్యుని కవిశ్రేష్ఠున్ మదిన్ గొల్చి ; తి
క్కన సమ్యక్కృత పద్యశిల్ప ఘన యజ్ఞ శ్లాఘ్య నిర్వాహకున్
వినయంబొప్పగ సంస్తుతించి ; విబుధున్ , విస్తార విఖ్యాతు నె
ఱ్ఱన సత్కావ్య మహాప్రబంధ రచనా ప్రాగ్రేసరున్ దల్చి ; పో
తన మందార మరందు బిందు సమ పద్యప్రౌఢి సౌలభ్య శై
లిని సద్భక్తి భజించి ; కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీ
లిని శ్రీనాథ కవీంద్రు చాటు కవితా లీలా చమత్కార వా
గ్ధను బూజించి ; మహాంతరార్థయుత సత్కావ్యాను సంధాను బె
ద్దన బాండిత్య నిధిన్ నుతించి ; సుగుణోద్యత్ కీర్తి పాత్రున్ సుధీ
జన చిత్తప్రియు రామకృష్ణకవి సంశ్లాఘించి ; పేర్మిన్ మన
జన చిత్తప్రియు రామకృష్ణకవి సంశ్లాఘించి ; పేర్మిన్ మన
మ్మున నత్యద్భుత భావసంయుత ' కళా పూర్ణోదయ స్రష్ట ' సూ
రన విద్వత్కవి , ద్వ్యర్థి కావ్యరచనా ప్రాజ్ఞున్ ప్రశంసించి ; భూ
వనితా కాంతుని నాంధ్రభోజ బిరుద భ్రాజిష్ణు శ్రీ కృష్ణ రా
యని సంప్రీతి స్మరించి పూర్వకవి సమ్యక్ రీతి సారస్వతా
ర్చనమెల్లన్ గణియించి వారల సుధీ సంపన్నతన్ మెచ్చెదన్ !!!
కవి ప్రశస్తి బాగున్నది. కవి రాజులు ముందు నడవగా రాజకవి రాయలవారి ప్రవేశం!
రిప్లయితొలగించండి@ మందాకిని గారు
రిప్లయితొలగించండిసూక్ష్మం గ్రహించినారు...ధన్యవాదాలు !!!!..... పరితృప్తోస్మి......!!!!! :)
ఈ మాలిక వ్రాసినప్పటి నా ఆలోచనలు ఒక్క సారి మరలా----
రిప్లయితొలగించండితెలుగు కవిత్వమనే ప్రక్రియ మొత్తాన్ని ఒక చెట్టు అనుకొంటే......అది యింత శాఖోపశాఖలుగా విస్తరిల్లక మునుపు, ఒక చిరు మొక్కగా నున్న దశలో, దానికి పాదు తీసి,నీరు పోసిన మహానుభావుడు నన్నయ - ఆదికవి కాబట్టి.
' తిక్కన్న శిల్పంపు తెనుగు తోట '- విశ్వనాథ వారి మాట ...అందుకే ' పద్య శిల్ప ఘన యజ్ఞ శ్లాఘ్య నిర్వాహకున్ ' అనడం జరిగింది ....పద్య శిల్పమనే యజ్ఞాన్ని గొప్పగా నిర్వహించేవాడు అని...యజ్ఞమనే పోలికే యెందుకంటే , ఆయన తిక్కన సోమయాజి కదా మరి !!!
ఎఱ్ఱన ను ప్రబంధ పరమేశ్వరుడంటారు కదా అందుకని ఆ ప్రబంధ పదాన్ని చేర్చడం ఆయన విశేషణాల్లో !
సరే! పోతన మందార మకరందం వినని తెలుగు వాడెలాగూ వుండడు...అదే ఆయన కవిత్వ విశేషణం !
శ్రీనాథుడు రసిక కవివరేణ్యుడని అందరికీ తెలిసినదే కదా.....మరి " కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీలి " అంటే కీర్తి అనే స్త్రీ కౌగిలిని పొందగలిగిన అదృష్టశాలి అని.....మరాయనకు అలాంటి విశేషణాలే ఔచిత్యం కదా !!!
అందులోనూ చాటు కవితలకు పెట్టింది పేరాయన !
సరే.....పెద్దన మనుచరిత్రలోని అంతరార్థాలను గురించి తెలియని వారెవరు? తవ్వినకొలదీ బయటపడుతూనే వుంటాయి కదా !
రామకృష్ణుడంటే తెలుగింట ఆబాలగోపాలానికీ ప్రియమైనవాడే కదా .....
ఒకే పద్యానికి ఒకలా చదివితే రామాయణార్థమూ , మరోలా విరిచి చదివితే భారతార్థమూ ,వచ్చేలా చేయాలంటే యెంత విద్వత్తూ,మరెంతటి కవిత్వ సంపదా కావాలి? అందుకే ఆ సూరన విద్వత్కవి
ఇక యింత మంది కవి రాజుల తరువాత రాజకవి ప్రవేశం...(మందాకిని గారి మాటల్లోనే )
ఆంధ్రభోజ బిరుదం తో ప్రకాశించే మహా చక్రవర్తి ......అదీ సంగతి.....
ఏదో మరొక్కసారి వుబుసుపోక విడమరిచి చెప్పానండి .....పాఠక మహాశయులకు తెలియదనీ కాదు....తెలుసుకోలేరనీ కాదు...మన్నింతురు గాక !