ముప్పది రెండేడుల యతి
యిప్పుడమిని నేకధాటి నెటుల దిరిగెనో ?
యెప్పుడెటుల బుధజనులను
మెప్పించెనొ ? యెరుగ సాధ్యమే యితరులకున్ ?
శైశవమ్ముననె భాషాప్రౌఢి జూపించి
ప్రాజ్ఞుల నబ్బుర పరచినాడు ;
ఒక పేదరాలి యార్తికి గుంది బంగారు
తిష్య ఫలమ్ములందించినాడు ;
తల్లి కష్టములకు దలడిల్లి పూర్ణా ఝ
రిని నింటి ముందు పారించినాడు ;
పోటెత్తు నర్మదా పూర్ణ ప్రవాహమ్ము
నే యొక్క కడవ బంధించినాడు ;
ఏన్గు నద్దములోన జూపించు రీతి
నిగమ సారమ్ము దేటగా నిఖిల జగతి
తెలిసికొనునట్లు భాష్యమ్ము నిలిపినాడు
కువలయమున ధర్మము బాదు కొలిపినాడు !
కవితల్లజుండయి కమనీయ రమణీయ
సత్కావ్యముల బెక్కు సంతరించె ;
బండిత ప్రవరుడై భాషా మహా ప్రౌఢి
ద్రెళ్లు గ్రంథముల బరిష్కరించె ;
భక్తవరేణ్యుడై పలు దేవతా స్తోత్ర
సంచయమ్ముల బేర్మి సంఘటించె ;
నుపదేష్ట యగుచు గీతోపనిషత్సూత్ర
సార భాష్యమ్మును సంసృజించె ;
మనుజ జన్మమ్ము నందు సామాన్యుడొకడు
వేయి వేయేండ్లకైనను జేయలేని
పనుల ముప్పది రెండేండ్ల ప్రాయమందె
లీల సాధించి గురు పీఠి నేలగల్గె !
కలి చెలరేగ లోకమున గాసట బీసటయై కృశించు ని
ర్మల నిగమాంత వాక్యముల గ్రమ్మర నిల్పి సమస్త పాప పం
కిలముల రూపుమాప గల కేవల శుద్ధ సనాతనార్ష వి
ద్యల సమకూర్చె శంకరుడు తాత్వికపాళికి నొజ్జబంతియై
( ధర్మదండం - అవతార సమాప్తి ఘట్టం నుండి )